Thursday, May 28, 2020

వేమన శతకము 1 to 10

వేమన శతకము 
1
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ |

వైరాగ్యంతో ఆత్మానందం పొందే ఓ వేమనా! నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెం పుణ్యకార్యం చేసినను అది చాలా ఘనమైన ఫలాలని ఇస్తుంది. ఎలాగంటే చాలా చిన్నదైన మఱ్ఱి విత్తనం నుండి మహా వృక్షం పుట్టినట్టు.


2
ఆత్మశుద్ధి  లేని యాచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?

విశ్వదాభిరామ వినురవేమ.

పెద్దలనుండి వచ్చిన ఆచారమును అంతఃకరణ శుద్ధితో పాటించాలి. ఆత్మశుద్ధిలేని ఆచారము వ్యర్థం. వంటచేసే పాత్రలను ముందు శుభ్రపరచుకోవాలి. లేకపోతే ఆ వంట తినటానికి పనికిరాదు. అలాగే స్నానాదులతో బాహ్యశుద్ధి కలిగి ఉండటమే కాకుండా మనసును కూడా కామక్రోధాదులు లేకుండా ప్రశాంతంగా ఉంచుకొని శివపూజ చేయాలి. మనసున మాలిన్యము ఉంచుకొని పైకి ఆడంబరముగా శివపూజ చేసినా ఫలితం ఉండదు.       

3
గంగిగోవు పాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ. 

మేలైన ఆవుపాలు గరిటడైన అవి పిల్లలకి ఆరోగ్యం. గాడిదపాలు కుండడు ఉన్నా వాటికి ఈ గుణాలు ఉండవు కాబట్టి పనికిరావు. అలాగే భక్తితో ఆదరముతో పెట్టిన అన్నం తిన్నవారికి తృప్తిని ఇస్తుంది. ఇష్టం లేకుండా బండెడు అన్నం పెట్టినా అది అసహ్యమే వేస్తుంది.    
  

4
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు 
తళుకు బెళుకు రాలు తట్టెడేల 
చాటు పద్యమిలను జాలదా యొక్కటి 
విశ్వదాభిరామ వినుర వేమ!

మంచి జాతి కలిగిన ఇంద్రనీలమణి ఒక్కటి ఉంటే చాలు మెరిసే రాళ్ళు తట్టెడున్నా దాని విలువకి సరిపోదు సందర్భానుకి తగ్గట్టుగా అందమైన ఒక చాటు పద్యం లక్షల విలువ చేస్తుంది. అంతేగానీ వట్టి చప్పని పనికిరాని పద్యాలు వంద ఉన్నా ఏమి లాభం.    

5
మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి జూడ లోన జురుకుమనును 
సజ్జనులగువారు సారమిట్లుండు

విశ్వదాభిరామ వినురవేమ 

మిరియపు గింజ పైకి నల్లగా అందం లేకుండా ఉంటుంది. కానీ కొరికి చూస్తే కారం చురుక్కుమంటుంది. అదేవిధంగా సజ్జనులైనవాళ్ళు పైకి చాలా సామాన్యంగా కనబడతారు. కానీ వాళ్ళని కదిపితే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. మిరపగింజ ఆరోగ్యాన్నిచ్చినట్టు సజ్జనుడు చెప్పే మాటలు ఇహపరానికి సాధనములుగా ఉంటాయి.   
  
6
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికి దాని సువాసన చాలా దూరం వ్యాపిస్తుంది అలాగే గురువులైన వారు బయటికి నిరాడంబరముగ కనపడతారు, కానీ వారిలో  గొప్ప గుణములు ఉంటాయి.



7
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ!

భావం: 
మేడి పండు పైకి అందముగా కనపడుతుంది. దానిలోపల కనుక చూస్తే  పురుగులుంటాయి. పనికివచ్చే పదార్థం ఏమీ ఉండదు. అదే విధముగ పిరికివాడు కూడా పైకి మంచి పుష్టిగా కనబడతాడు కానీ అవసరానికి ఎదిరించి ధైర్యంగా నిలబడలేడు.  

  
8
నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: తనకు ఏమీ రాదు అని చెప్పుకొని తప్పించుకుని తిరిగే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చునని  చెప్పుకునేవాడు ప్రజలలో గౌరవాన్ని పొందలేక నిందలపాలు అవుతాడు. మౌనముగానున్నవాడే బుద్ధిమంతుడు, ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.




9
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: గొప్పదైన గంగానది ఎప్పుడూ కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. అదేవిధంగా పెద్దవారు అనుభవం ఉన్నవారు ఆవేశాలకు లోను కాకుండా హుందాగా ఉంటారు, అల్పులైనవారు ఆవేశంతో అరుస్తూ దుడుకుగా ప్రవర్తిస్తారు.  

 

10

నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 10
 

నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి  ప్రవహిస్తాయి  చిన్న సెలయేరులు పైకి పొంగి ఉధృతంగా వేగముగ ప్రవహిస్తాయి  అదేవిధంగా జ్ఞానులైన పెద్దవారు వివేకంతో ప్రశాంతంగా మాట్లాడుతారు. అల్పులైనవారు ఆవేశంతో మాట్లాడి కార్యాలు చెడగొడతారు.   



Tuesday, May 26, 2020

गंगा

गंगा


गंगा केवल नदी नहीं है 
इसकी एक कहानी है 
भारत के उजले सपनों की 
यह भी एक निशानी है 

उच्च हिमालय की महानता 
इस में बह कर आती है 
सब से अच्छा देश हमारा 
लहर लहर कह जाती है 

गान्धीजी के बन्दर तीन

गान्धीजी के बन्दर तीन 
सीख हमें अनमोल



गाँधीजी के बन्दर तीन,
सीख हमें देते अनमोल ।

बुरा दिखे तो दो मत ध्यान,
बुरी बात पर दो मत कान,
कभी न बोलो कड़वे बोल ।

याद रखोगे यदि यह बात ,
कभी नहीं खाओगे मात,
कभी न होगे डाँवाडोल ।

गाँधीजी के बन्दर तीन,

सीख हमें देते अनमोल । 

चन्दामामा कहो तुम्हारी शान तुम्हारी कहाँ गयी

चन्दामामा कहो तुम्हारी शान तुम्हारी कहाँ गयी  



चंदा मामा कहो तुम्हारी
शान पुरानी कहाँ गई?
कात रही थी बैठी चरखा
बुढ़िया नानी कहाँ गई?


सूरज से रोशनी चुराकर
चाहे जितनी भी लाओ,
हमें तुम्हारी चाल पता है
अब मत हमको बहकाओ!


है उधार की चमक-दमक यह
नकली शान निराली है,
समझ गए हम चंदामामा
रूप तुम्हारा जाली है!


Monday, May 25, 2020

దాశరధి శతకము-పద్యము-భావము

దాశరధి శతకము ...... పద్యము - భావము

1వ పద్యము :
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా, అనంతమైన పరాక్రమముచే, పరశురాముని గర్వభంగ మొనర్చి, ఏక పత్నీ వ్రతమును తాల్చి, మేఘమువంటి శరీర ఛాయ కలిగి ఇక్ష్వాకు కుల వంశ చంద్రుడివై, రాక్షసులను చంపు వాడవు.

2వ పద్యము :
శ్రీ రఘురామ, చారు తులసీ దళధామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ; జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.

భావము :
ఈ పద్యములన్నియు భద్రాచలములో వెలసిన రామచంద్రుని మీదనే !

మంగళకరమైన ఇక్ష్వాకు వంశమున జన్మించి తులసి పేరులు మెడకొని, శమ క్షమాది శృంగార గుణములను తాల్చి వీరులైనటువంటి కబంధుడు మొదలైన రాక్షసుల సంహరించినటువంటి, లోకములను కాపాడు నటువంటి ఓ రామా! నీకు మంగళము, నీవు మా పాపములను బాపుము.

3వ  పద్యము :
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నీవు సత్యమునే పలుకు వాడవు. శరణా గత రక్షణము నీకు వెన్నతో బెట్టిన విద్య, పాపాలను హరించువాడవు. బ్రాహ్మణులను బ్రోచు వాడవు. కరుణా సముద్రుడవు. ఆకాశగంగలోని పద్మములందలి పుప్పొడిచే అలంకరింపబడిన పాదములు కలిగి, ప్రకాశించే ఆభరణములు గలవాడవు.

4వ పద్యము :
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ

భావము :
ఓ రామా! నీవు తేజోవంతులు, పరాక్రమముగల శత్రువులను జయించిన వాడవు. గరుత్మంతుడినే గుఱ్ఱముగా కలవాడవు. కష్టములనే కారు చీకట్ల తొలగించి, సజ్జనులతో స్నేహము చేసే దయాశీలివి. తామర వంటి సీతాదేవి హృదయమును తుమ్మెదవలె చూరగొని, తామరవంటి రాక్షసుని ఏనుగు వలె తుదముట్టించు వాడవు. మంగళప్రదమైన ఆకారము కలవాడవు.

5వ  పద్యము :
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దశరథ రామా! కరుణా పయోనిధి! నీవు సర్వసంపదలు ఇచ్చువాడవు. సునందుడు మొదలైన ఋషులతో కొలవ బడ్డ పాదములుకలవాడవు. నీ కీర్తి కొలచుటకు కొలబద్దలేదు. రామ చంద్రుడవు. ఆటపాటలతో ఆనందించెడి వాడవు.

6వ పద్యము :
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఈ శతకము రచించుట నా ప్రజ్ఞకాదు, వినయముతో శరీరమును వంచి, పుజ్యులయిన పెద్దలకు, రఘునాధ భట్టాచార్యులకు మ్రొక్కి, కవులను స్తుతించి చేసిన పని ఇది. దాని లోని లోపమునెంచక భక్తి చూసి గ్రహింపుము.

7వ  పద్యము :
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
కరుణాపయోనిధీ! దశరధరామా! రేగు పండ్లకు ఆశబడి ముత్యములను ఇచినట్లు, దుష్టుల యోగ్యత నెరుగక నా కవిత నంకితమిచ్చి మోసపోయినాను. నీవే నా జివ్హకు పరిశుద్ధత కలుగునట్లుగా నా నాలుక ఆనెడి రంగస్థలమున నీవు నిలిచి, నటించి నా పద్యములను రమణీయములుగా తీర్చిదిద్దుము.

8వ పద్యము :
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఇంద్రియజేతవైన ఓ రామా! నీవు లక్ష్మీకాంతితో విలసిల్లుతున్న హారములు ధరించి, నీలి మేఘశ్యాముడవై, మాకోర్కెలను తీర్చుతూ మా పాపాలను హరించుతూ, ఖరాదులైప రాక్షసాటవికి గొడ్డలివంటి వాడవై మము ఎల్లవేళలా కాపాడుము.

9వ  పద్యము :
దురితలతాలవిత్ర, ఖర దూషణకానన వీతిహొత్ర, భూ భరణకళా విచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి స్ఫురదర విందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ నీలిమేఘశ్యామా! నీవు పాపములనే తీగలను గొడ్డలితో నరకుతూ, రాక్షసాటవికి అగ్నిహోత్రుడవై చెలగి, మా సంసారబంధవిమోచన కావించి మమ్ము రక్షింపుము. భూభారము భరించే కళగలిగిన వాడవు. తేజోవంతమైన కమలముల వంటి కన్నులు కలవాడవు. మేఘచ్చాయగల పుణ్యచరితుడవు.

10వ పద్యము :
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సంజనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చందన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దాశరథీ! నీ రూపు వర్ణనాతీతము. బంగారు వస్త్రము ధరించి పదునైన గొడ్డలితో సంసారమనెడి అడవిని నాశనం చేసి సజ్జనులను రక్షించు వాడవు. దేవతలచే స్తుతించ బడునట్టి గుణములు కలిగినవాడవు. అగ్ని వంటి శౌర్యపరాక్రమములతో నిండి, శరత్కాల మేఘములు, మల్లెలు, మంచి గంధమువలె పరిమళించు, కర్పూరము వంటి స్వచ్చమైన కీర్తికలవాడవు.

11వ  పద్యము :
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రఘువంశ సుధాంబుధి చంద్రా! శ్రీ రామా! సంసార బంధములనుండి తొలగించి జనులను తరింపజేయు నామము కలిగిన దాశరథీ! నీ పద పద్మములను ఉత్పల చంపకమాలిక లనెడి పద్యపు పూవుల పూజ జేయనిమ్ము.

12వ పద్యము :
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
మంచి కావ్యము కేవలము రసజ్ఞులే ఆదరిస్తారు. కాని రసహీనులు ఆదరించలేరు కదా! అది ఎట్లన చంద్రుని కిరణములు కరుగునది చంద్ర కాంత శిలలే, కాని వింధ్య పర్వతము మీది రాళ్ళు కరిగి దద్రవించవు కదా!

13వ పద్యము :
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
సూర్య వంశశ్రేష్టా! శ్రీ రామా! నీ పేరుతో రచింపబడిన కావ్యము ఎన్ని దోషము లయిన పలుకుతున్నప్పటికీ పవిత్ర మయినదే కదా! అది ఎట్లనగా ఆకాశగంగా జలము వంకరగా ప్రవహించినను, పైకి మురికిగా కనిపించును. ఆ గంగ యొక్క మహాత్యము లెక్కించుట సాధ్యమా!

14వ పద్యము :
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నీ నామము పాపములను బాపునది, సంసార సాగరమును దహించుచేయునది. విస్తృతముగా వ్యాపించిన దుఃఖజ్వాలలను ఆర్పివేసే అమృతవర్షము చెడుమతాచారములను ఖండించు గొడ్డలివంటిది.

15వ పద్యము :
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
పావనరామా! నీ నామము శివునకు, విభీషణునకు, పార్వతికి శ్రేష్టమైన మంత్రమైనట్లే, గజేంద్ర, అహల్య, ద్రౌపదులకు కష్టములను తొలగించు చుట్టమైనట్లే, నీ నామమును అన్ని వేళలా నా నాలుకపై నాట్యమాడునట్లు చేయుము.

16వ పద్యము :
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! ఆపద సమయములోను, వృద్ధాప్యములోను, మరణము సంభవింప బోవునపుడు, గొంతు యందు కఫము నిండి యున్నప్పుడు, బంధువులు చుట్టుముట్టినపుడు నీ నామ స్మరణ చేయ గల్గుదునోలేదో, నాకు వీలైనపుడే నీ నామ స్మరణ జేసెదను. ఎంత చక్కగా సెలవిచ్చాడు? మనమంతా ఈ పై సమయాల్లో తల్చుకోవచ్చులే అనుకోని దైవ స్మరణకి దూరమవుతున్నాము. అందరము కంఠతా పట్టవలసిన శతకమిది.

17వ పద్యము :
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ శ్రీరామా! పతితులను పావనము చేయు నామము కలిగిన రామా! నీ నామ స్మరణ జేయు భక్తుల పాద ధూళి నా శిరమున దాల్చెదను. ఎందుకంటే యమభటులు ఆ ధూళి వున్న చోటుకు రారు.

18వ పద్యము :
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ పరిపూర్ణమూర్తి, శ్రీరామా! నువ్వు బ్రహ్మకు తండ్రివి, సనక సనందాది మునులకు ఉత్కృష్టమైన దైవమును గరుడ కేతనము కలవాడవు సూర్యవంశములలో రాజశ్రేష్టుడవు. అట్టి నిన్ను స్తుతించెదను.

19వ పద్యము :
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నా కవిత్వమనే పూలదండలు నీ యొక్క కీర్తి కాంతకు అంకితమిస్తున్నాను. నీ కీర్తి కాంత ఎటువంటిదంటే నీవు రావణుడి తలలను ఒక్కవేటున తెగనరికిన విలు విద్యా ప్రవీణుడవని, దేవతా కోటి పూజలందే వాడవని, పాపాలను హరియించే వాడివని ఇన్ని సద్గుణాలు నావే అని పలికేటటువంటిది.

20వ పద్యము :
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! భద్రగిరిలో వెలసి యున్న నీవు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తివే. అది ఎట్లనగా వైకుంఠమే భద్రగిరి. విరజానదియే గోదావరి. లక్ష్మిదేవియే సీత. అచటి పరివారమే వీరవైష్ణవమతస్థులు. అలాంటి నీవు మమ్ములనుద్ధరించుటకు ఇక్కడ శ్రీ రామ చంద్రుడివైనావు.

21వ పద్యము :
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దాశరధీ! నా జన్మ పరమ పావనమైనటువంటిది. అది ఎందుకంటావేమో నాకనుల పండుగగా ఇక్కడ(భద్రాచల) గొదవరీ నదివడ్డున వెలసిన శ్రీరామచంద్రుడ వైన నిన్ను, లక్ష్మణుని, నీ అంకస్థ అయిన సీతాదేవిని, గొప్పవైన మీ ధనుర్భాణములను, శంఖచక్రములను చూచితిని. (భద్రాద్రి రాముడికి శంఖ చక్రాలు ధనుర్భాణాలు ఉంటాయి.)

22వ పద్యము :
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దాశరధీ! నాకు అచంచలమైన భక్తి నిచ్చి రైతునకు నాగేటి చాలున ఫలితమిచ్చినట్లు, దాహార్తికి ఆకాశ గంగ నీరిచ్చినట్లు, మురికియైన వికారమైన మనస్సుగలవాడైన నన్ను సవరించి నీ మీద మనసు పెట్టునట్లు, నిన్ను కొలుచునట్లు చేసితివి.

23వ పద్యము :
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కంగొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామచంద్రా! తర్కవాదముతో తవ్విననూ కనుగొనలేని నిధివంటివాడవు, ఈ రోజు భక్తితో తయారు చేయబడిన అంజనమునందు, నీవు నాకై దొరికితివి. నన్నెప్పుడు వదలకుండ నా హృదయ కమలమునందు నివసింపుము.

24వ పద్యము :
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నీవు దీన జనోద్ధరుడవు. పాతకవిరాముడవు. సద్గుణములకు కల్పతరువువు, కామక్రోధాలను జయించిన వాడవు, నిన్నే దైవముగా నమ్మిన మమ్ము ఉత్తమగుణములు కలవాడివైన నువ్వు కాపాడుము.

25వ పద్యము :
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నిశ్చలమైన భక్తితో నిన్నే కొలిచెడి వారిని నీవు విడువవు. కాని ఇది తెలియక కొందరు హీనులు, పంచదారని విడిచి వేపచెదును రుచిచూసినట్లు, నిన్ను విడిచి అల్పదైవములను పుజించుచున్నారు.

26వ పద్యము :
’రా’ కలుషంబులెల్ల బయలంబడద్రోచిన ’మా’క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
'రామా' అను నీ దివ్య నామాక్షరములు పాపములను హరియించుటకు పుట్టినిల్లు. 'రా' అన్న అక్షరం పలకటం వల్ల పాపములన్నీ బయటికి పోతాయి. 'మ' అన్న అక్షరం పలకటం వల్ల నోరు మూసుకొని తలపువలె కాడుతుంది. ఓ దయాసముద్రా అట్టి నీ నామము భజించని వాడు ముర్ఖుడే కదా!

27వ పద్యము :
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
కాకుత్సవంశమున జన్మించిన శ్రీరామా! నీ నామము పలుమార్లు భజించిన ముక్తిదాయకమవును కదా! మోక్షము పొందుటవలన తిరిగి పుట్టనేరు కదా!

28వ పద్యము :
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
రామనామస్మరణ అన్ని తీపి వస్తువులకన్న మధురాతి మధురమయినది. అవి ఏవనగా చక్కరలోని తీపిదనము, స్త్రీ ఎర్రని పెదవి. పట్టుతేనె. ప్రాపంచిక విషయాలలో ముంచి తేల్చే తీయని వస్తువులకన్నా ఆస్వాదించగలిగితే భగవానుని నామము ఎంతో మధురమని కవి చెప్పకనే చెప్పుతున్నాడు.

29వ పద్యము :
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
గరుత్మంతుని వాహనముగా గల ఓ రామా! నిన్ను మనస్పూర్తిగా నమ్మిన వారి కొండంత పాపములైనను కొనగోట మీటెదవు. వారికి అఖండ ఐశ్వర్యములు ఇచ్చెదవు. మరణానంతరము ముక్తి నొసగెదవు. నీ దయకు అవధి లేదుకదా!

30వ పద్యము :
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! చిక్కని పాలమీదనున్నచక్కని మీగడను తియ్యని పంచదారతో కలిపి, ఎంచక్కా ప్రీతితో తినినట్లుగా, మీగడ వంటి నీ రూపము నా ప్రేమయనెడి పళ్ళెమునందు కూర్చబడినది. అది నాకు, దాస్యము అనేది దోసిళ్ళలో లభించినట్లుగా భావించి నిన్ను నా మనసులో నిలిపి నీ నామస్మరణ చేసెదను.

31వ పద్యము :
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ మహత్యముచే నీవు సీతాదేవిచే సిరి సంపదలు ఇప్పించుచు, హనుమంతునిచే బాధలు తొలగించుతూ, లక్ష్మణునిచే సంకటముల తొలగించుతూ, నీ నామముచే పాపహరణ చేయుచున్నావు. ఇదియంతయు నీవు నిర్మించిన వజ్రముతో కూడిన గూడువంటి రక్షణ వాసములె కదా!

32వ పద్యము :
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
అహల్యను శాపవిముక్తను చేసిన మీ పాదములందు నాకు నిశ్చల భక్తి కల్గుగాత. నీ పాదములందు నగలు, వజ్రము, అంకుశము, ధ్వజము, విల్లు, చక్రము, కల్పవృక్షమువలె పద్మరేఖలు స్పష్టముగా కనపడుచు ప్రకాశించుచున్నవి.

33వ పద్యము :
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దాశరధీ! రామా! కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ మూర్తివై పాపులనుద్ధరించిన వాడా సముద్రములో ప్రవేశించితివి, మందర పర్వతమును పైకెత్తితివి, భూమిని నీ కోరలతో పైకి ఎత్తితివి. హిరణ్యకశిపుడిని చీల్చితివి. బలిచక్రవర్తిని పాతాళమునకు తోసితివి. అట్టి నీవు నా మనస్సునందు నిలువగారావా!

34వ పద్యము :
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
శ్రీరాముని మించిన దైవము, పోటీకాగల వీరుడు లేడని ఏనుగుని అధిరోహించి దుందుభి మ్రొగించుచూ చాటించెదను. ఎందుకనగా నువ్వు యుద్ధమునందు అరవీరభయంకరుడివి, దుఃఖితులకు బంధువుకు, మేటి విలుకాడివి. ఈ పద్యములో శబ్దాలంకారము బాగుంది. దుందుభి మ్రోగితే వచ్చే శబ్దాన్ని పద్యములోనే చూపించాడు కవి.

35వ పద్యము :
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
సీతామనోహరడైన నిన్ను ఎల్లవేళలా సేవించుచుందును. నీవు సీతాదేవి నేత్రములనెడి పద్మముల వికసింపజేయు చంద్రుడివి. ఆమె వక్షములను ఎదుర్కొను మేఘముడవు. ఆమె యవ్వనమనే అరణ్యములో తిరుగాడే ఏనుగువు.

36వ పద్యము :
ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురు వజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
దీనజనోద్ధారకుడవైన నీవు నన్ను భయంకరమైన ఈ బాధలనుంచి కాపాడుము. భయంకర భూత, ప్రేత, పిశాచములవలన, వ్యాధులవలన సర్వభయములకు అడ్డుపడే నీ పాద పద్మములందున్న వజ్రపంజరములోనికి శరణార్థివై ప్రవేశించితిని.

37వ పద్యము :
జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నీ కథలనే విని, నీ పాదపద్మములను కడిగిన నీటిని తాగెదను. నిత్యము నీ యందే భక్తి నిలిపి నీ లీలల యందే నా ధ్యాస నుంచి నీ భక్తుల తోనే నాకు సహవాస మొనర్చుము.

38వ పద్యము :
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ నామ మహత్యమే యమభటులను పారదోలి పిశాచ ఆకారము కలిగిన దరిద్రతను పారద్రోలి నిన్ను నిత్యము జపించు వారికి వైకుంఠ ద్వారముల తెరిపించును. అట్టి వారంటే యమభటులు కూడా భయకంపితులగుదురు.

39వ పద్యము :
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నా విన్నపము శ్రద్ధగా విను. ముల్లోకాలు గాలించిననూ నా వంటి పాపాత్ముడు లేడు. దేవతలలో నీ వంటి దైవము లేడు. పాపాత్ముడనైన నా పాపములను పోగొట్టి నీ సన్నిధిని చేర్చుకోదగిన దైవము నీవే.

40వ పద్యము :
పెంపునఁదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీవే నాకు తల్లివి, తండ్రివి, వైద్యుడవు, సర్వము నీవే అయి నన్ను నీ సన్నిధికి చేర్చుకొనుము. నన్ను పోషించుటలో తల్లిగా, చెడు సావాసములనుండి రక్షించు తండ్రిగా, దేహమునందలి ఇంద్రియ నిగ్రహమును కలిగించు వైద్యుడిగా నాకు నువ్వే దిక్కు.

41వ పద్యము :
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
జగముల నేలే దాక్షిణ్యమూర్తి! కడుపులో అనేక బ్రహ్మండములను పదిలముగా నిలిపినవాడవు. చేతనములను, అచేతనములను రక్షించు దైవానివి. నీ ప్రపంచములోని అణువునైన నన్ను నా పాతకములనుండి రక్షింపుము.

42వ పద్యము :
గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబుఁజెందు పె
న్నిద్దవు గండుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నీవు యోగి హృదయ కమలముల నుండెడి తుమ్మెదవు, సీతాదేవి బాహు పంజరమునకు రామచిలుకవు. వాటినుండి విముక్తుడవై నాకడకు వచ్చినన్ను కాపాడుము.

43వ పద్యము :
కలియుగ మర్త్యకోటినిను గంగొన రానివిధంబో భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో
బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
పిలిచినా పలుకవేమి నా దైవమా? కలియుగములో భక్తుల మొర వినగలేవా?మానవులను మరిచితివా? నీ వాత్సల్యము తొలగిపొయినదా! మమ్ము కరుణింప లేవా? సముద్రమనెడు ఆపదలో మునుగుతూ ఎంత పిలచినను పలుకవేమి? మా యందు ఇంత మారుపా? అనకూడదు కాని రావణుని చేత సీతాదేవి పొందిన చెర మరచినావా? కానగ రావా! ఓ రామా! శ్రీ రామా!

44వ పద్యము :
జనవర మీక థాలి వినసైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ కథలను వినలేక చెవులకు గంటలు కట్టుకున్న ఘంటాకర్ణుడి వంటి నీచులనే ఉద్దరించినవాడా ఓ శ్రీరామ చంద్రా! సనక సనందనాది మునులను కాపాడినట్లే నన్నుకాపాడు.

45వ పద్యము :
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరథీ కరుణాపయోనిధి

భావము :
సంకట హరణా! రామభద్రా! పాపములు సమీపించు వేళలయందు, సంగ్రామ వేళలయందు, సర్పభీతి పొందునప్పుడు, జ్వరముల వంటి దుఃఖములు కలుగునప్పుడు, నీ భక్తులను ఆయా కష్టములనుండి కాపాడావట కదా! నీవును, నీ సోదరులను నన్ను కాపాడేందుకు రక్షగా నిలువండి తండ్రీ!

46వ పద్యము :
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాంపవే
తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
సంసార సాగరమును, నా పూర్వజన్మ కర్మ పరిపక్వములను ఈదలేక నిన్ను వేడుకుంటున్నాను. దయ దలిచి నన్ను కాపాడు దయా శరధీ. నీ పాదముల వద్ద భక్తి ఆనెడి పడవచేత బైటపదవలనెను కొనుచుంటిని.

47వ పద్యము :
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్
దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
పాపాల బ్రోచు దశరధ రామా! నేను పాపినైనను నీ నామామృతము పానకము వలె తియ్యగానున్నది. నీవు చిలుకను నీ నామ ముచ్చరించిన కాచినట్లే నీ నామానురక్తుడనైన నన్ను కుడా కాపాడుము.

48వ పద్యము :
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీఁదనగు మోసమెఱుంగదు మానసంబు
స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
మేము పరాయి సొమ్ముకాసించినా, పరస్త్రీ వ్యామోహం పొందినా,పరాన్న భోజనము కోరినా, అవివేకులమై ఘోరాతి ఘోరములైన పాపములు చేసినను మము రక్షించటయే నీ వంతు. 'తప్పులు చేయుట మా వంతు, దండన పొందుట మా వంతు, దయ చూడటమే నీ వంతు' దయా శరధీ! దాశరధీ! మమ్ము కాపాడుము. యమదూతల శిక్షల నుంచి కాపాడుము స్వామీ.

49వ పద్యము :
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నే చేసిన నేరము లెంచక ఓ రామా! ఎన్నో ఘోరములు చేసితిని, భగవంతుని యందు తప్పులు చేసితిని, అన్యదేవతలను కొలచి వారి యొక్క స్నేహములు చేసితిని. అయినను నీ దాసుడనైన నన్ను కాపాడుము.

50వ పద్యము :
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు త్తరువున గట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
పరాయి సోమ్ముమీద మక్కువ, పరస్త్రీ వ్యామోహం కలిగించే నా మనసనే దొంగను నీ సేవచే ప్రకాశించిన జ్ఞానము అనే తాళ్ళతో బంధించి, నీ పాదములనే కల్పవృక్షమునకు కట్టివేయుము.

51వ పద్యము :
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ లీలలు స్మరించి పొగడుట నా వశము కాదు. నేను కాశీపురమున నివసించు శివుడిని కాను, నీ పాదధూళి మహత్యము తెలుపగల అహల్యను, కాను, నీ నామ మహత్యము పొగడగల విభీషణుడను కాను. అయిననూ దయా శరధి వైన నీవు నన్ను కాపాడుట నీకు ధర్మమే.

52వ పద్యము :
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వము నొందెగా వునందా తవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
కోరిన కోర్కెలను తీర్చే కల్పతరువైనటువంటి నీ నామ స్మరణ భాగ్యమును కలుగజేయును. రాయిగా మారిన అహల్యకు శాపవిమోచన కలిగెను. శత్రువు సోదరుడైన విభీషణునకు రాజ్యసౌక్యము కలిగెను. తక్కువ కులమునకు చెందిన శబరి, గుహనకు పుణ్యము కల్గెను. వానర జాతి మహత్యము పొందెను.

53వ పద్యము :
మామక పాతక వజ్రము మ్రాంపనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నా పాపములు లెక్కక అందనివి. చిత్రగుప్తుడు, యముడు, కాల కింకరులు ఏమిచేసినా అంతకు పూర్వమే భక్తి చింతామణి వయిన నీవు నన్ను కాపాడెదవు.

54వ పద్యము :
దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
శబరి నీకు చుట్టమా? కాదే! అయినను ఆమె ఇచ్చిన ఎంగిలి పండ్లను తిని, ఆమెను మోక్షమొసగితివి. గుహుడు నీ దాసుడా? కాదే! అయినను అతనికి నీ సేవ చేయు భాగ్యమునిచ్చితివి. నేను ఏ పాపముచేసితినని నన్ను కాపాడకుంటివి. శబరి, గుహులు నీకు దగ్గర వారయినట్లే నన్ను కూడ నీ చెంత చేర్చుకొనుము.

55వ పద్యము :
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
లోక రక్షకుడైనటువంటి శ్రీరామా! ద్రుపద రాజ తనయ మొర వినిన వెంటనే అక్షయమైన వలువల నిచ్చి కాపాడిన రీతి నన్ను కుడా కాపాడుము. నా ప్రార్ధనను కూడా విని సాక్షాత్కరించుము.

56వ పద్యము :
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్
జాలముసేసి ాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీల మేఘశ్యాముడవయిన నీ రూపము దాచుకొనగలవేమో కాని, నీ నామ మహిమను దాచలేవు కదా! అదే మాకు మోక్షకారకమవుతున్నది.

57వ పద్యము :
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ

భావము :
దీనవత్సల బిరుదాంకితుడగు ఓ రామా! అన్ని వేళలా నిన్ను తలచే మాపట్ల నీకు పరాకు వలదు జాగ్రత్త సుమా! దీనవత్సలుడనే వజ్రము వంటి అభేద్యమైన బిరుదు వ్యర్ధము కాకూడదు. నా పాపసముద్రమందు నావవై నన్ను నిరంతరము కాపడవలెను స్వామీ!

58వ పద్యము :
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఏదో తెలియక తప్పులు చేశాను స్వామీ కాని నన్ను తండ్రివలె రక్షింపుము. అన్యదైవములను ఎరుగను. నీకు నచ్చిన నీ దాసజనులు మెచ్చిన నీ సేవకుని వంటివాడను. నీవే నన్ను నా తప్పులనుండి కాచవలెను.

59వ పద్యము :
ఇతడు దురాత్ముడంచుజను లెన్నఁగ నాఱడిఁగొంటినేనెపో
పతితుఁడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేఁడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నన్ను దుర్మార్గుడని, పాపాత్ముడని అంటే అననీ జనులు. పతితపావనుడవైన నీ కరుణ ఉండగా వేరెవరినీ పూజించను. నువ్వు ఇహలోక సుఖములు ఇస్తే ఇయ్యి. కాని నాకు కావలిసింది మోక్షము. రామ అనే మధురాక్షరములు సాటిలేని మోక్షమోసంగునని ధృడముగా నమ్మి నిన్ను కొలుస్తున్నాను.

60వ పద్యము :
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ
లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై
దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దయాసాగరా అత్యంత గొప్పదైన నీ దయ నామీద కొంచెం చిలికితే చాలు, ఆ అండ చూసుకొని నా పాపముల నెల్ల తిరస్కరించెదను, శత్రుసముదాయమును పారదోలెదను, కోర్కెలను తొలగించెదను. నీ నామస్మరణ చేస్తూ నీ బంటునై యమభటులను సైతం తరిమికొట్టెదను.

61వ పద్యము :
జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం
పలరఁగ జేసెనాతిగఁబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ బాణము సప్తసముద్రములను ఒక్కచోటికి తెచ్చినది. నీ పాదధూళి రాతిని నాతిగ మార్చినది. నీ మహత్యము నెంచుటకు బ్రహ్మాదిదేవతలకు కూడ శక్యము కాదు మరి నేనెంతటి వాడను.

62వ పద్యము :
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
దాశరధీ! కరుణా పయోనిధీ! నీ అద్భుత మహిమవలనే ఒక కోతి కోటిమంది రాక్షసులనుగెల్చి దావానలమును చల్లబర్చుకోగల్గింది. అట్టి నీ మహిమ, సీతాదేవి పాతివ్రత్య మహిమ, వర్ణింప బ్రహ్మకైనను సాధ్యమా!

63వ పద్యము :
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ

భావము :
శ్రీరామా! జానకీపతీ! రాజ శ్రేష్టుడయినటువంటి నీవు రఘువంశజులలో గొప్పవాడవు, ముల్లోకములలో రాజ్యములను స్థాపించెడి వాడవు, మోక్షము నిచ్చెడి వాడవు. అట్టి నీవు నా పాపములను పోగొట్టి నన్ను రక్షిమ్పుము.

64వ పద్యము :
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నిను సేవించే భక్తుల భాగ్యమే భాగ్యము. ఏలయన సత్వగుణ ప్రధానుడవయిన నీవు విశ్వరూపివి కదా! పాల సముద్రమే నీవిడిది, బ్రహ్మదేవుడు నీ తనయుడు. లక్ష్మీదేవి నీ భార్య. ఈ భూమి నీకు సింహాసనము. ఆకాశము గొడుగు. సూర్యచంద్రులు రెండు కళ్ళు. ఆదిశేషుడు పూలపాన్పు.

65వ పద్యము :
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
రామా! రాతిని నాతిగ చేయుట ఒక వింత, నీటిలో మునగకుండ రాళ్ళను తెలునట్లు చేయుట మరొక వింతగావచ్చు గానీ, నిన్ను స్మరించిన వారికి నీవు మోక్షము నొసగుట ఆశ్చర్యము కానేకాదు.

66వ పద్యము :
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ లోకపావనమూర్తి! నాకు దైవము, తల్లి, తండ్రి, దాత, గురువు, మిత్రుడు నీవేయని భావించుచుండగా, నేను చేసిన పాపములు నాకు మనోవికారము కలిగించి, దుష్టచింతనను కలిగించుచున్నవి. దాశరధీ! నీ ఉతృష్టమయిన దయచే నాపాపపు ఆలోచనలను పోగొట్టి నన్ను కాపాడుము. అదే పదివేలు.

67వ పద్యము :
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! ఇంద్రభోగములనుభవించినా ఆశకు అంతు ఉండదు. మేరు పర్వతమంత ఆస్తి ఉన్నాకూడా ఒక్క కాసు కూడా వెంటరాదు. తెలిసీ, తెలియక చేసిన పాపములు మాత్రము వదలవు. మరుజన్మనిష్టపడని నన్ను నా కర్మానుభవమును నాశనము చేసి రక్షింపుము.

68వ పద్యము :
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగులే రకట దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
దశరధ నందనా! రామా! వివేకులు, దయాపరులు, సత్యసంధులు, అలుబ్దమానవులు, పతివ్రతా శిరోమణులు, బ్రాహ్మణులు, గోవులు, వేదములు భూభారము వహించు పుణ్యాత్ములు. వీరిని పూజించుట నావంటి అవివేకులు తెలిసికోలేకున్నారు.

69వ పద్యము :
మత్స్యావతారము:-
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఇక్కడనుండి దశావతార వర్ణన మొదలవుతుంది. మత్స్యావతారమున సముద్రములో చొచ్చుకుపోయి అతి కోపిష్టియైన, వీరుడైన వేదములను దొంగలించిన రాక్షసుని చంపి, వేదములను రక్షించి, బ్రహ్మకు వాటిని ఔదార్యముతో తిరిగి ఇచ్చినావు కదా. అట్టి నీవు నన్ను రక్షింపుము.

70వ పద్యము :
కూర్మావతారము:-
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో
ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
అత్యాశతో దేవదానవులు, పాలసముద్రమును అమృతం కొరకు చిలికారు. దానికి మందర పర్వతమును కవ్వముగా, ఆదిశేషుని త్రాడుగా చేసికొన్నారు. ఆ ధాటికి భూమి కంపించింది. అప్పుడు కూర్మావతారమెత్తి మందర పర్వతము మోసి అమృత సంపాదనకు తోడ్పడిన నీవు అదే విధముగా నా మనసులో కుడా అమృతము నింపుము.

71వ పద్యము :
వరాహావతారము:-
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
పూర్వము హిరణాక్షుడను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి ఎత్తికొని పోయి సముద్రములో దాక్కొనియుండగా, నీవు వరాహావతారము దాల్చి, ఆ రాక్షసుని చంపితివి. భూమిని నీ కుడిపంటి కోరయందు దాల్చి రక్షించితివి. అట్లే నన్ను కుడా రక్షింపుము.

72వ పద్యము :
నరసింహావతారము:-
పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
భయంకరమైన కోరలతో, గోళ్ళ కొనల మెరుపుతో కూడిన శక్తి కృపగా నృసింహ రూపుడవై హిరణ్యకశిపుని చీల్చి చెండాడి నట్లు, నా పాపములను భయంకరమైన, స్పష్టమైన, సామరస్యమైన శక్తితో చీల్చి చెండాడి, దయతో ప్రహ్లాదుని కాచినట్లు నన్నును కావుము.

73వ పద్యము :
వామనావతారము:-
పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే
లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! ఇంద్రభోగములనుభవించినా ఆశకు అంతు ఉండదు. మేరుపర్వతమంత ఆస్తి ఉన్నా కూడా ఒక్క కాసు కూడా వెంటరాదు. తెలిసీ, తెలియక చేసిన పాపములు మాత్రము వదలవు. మరుజన్మనిష్టపడని నన్ను నా కర్మానుభవమును నాశనము చేసి రక్షింపుము.

74వ పద్యము :
పరశురామావతారము:-
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ రామా! నీవు భృగు వంశమున జన్మించి, పరశురాముడవై తండ్రిని హతమార్చిన కార్తవీర్యార్జుని మీద కోపముతో దుష్ట క్షత్రియుల పీడను ధరిత్రికి తొలగించినావు. వారి నెత్తుటి ధారలతో పితృదేవతలకు తర్పణ ఇచ్చావు. అట్లు జయించిన భూమిని బ్రాహ్మణోత్తములకు దానము నొసిగావు. అదే విధంగా నా పాపములనే పీడను తొలగింపుము .

75వ పద్యము :
రామావతారము:-
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఓ దాశరధ రామా! మానవుడే మహానీయుడనే విధంగా మాచరించి చూపిన నీవు మమ్ము ధర్మ మార్గము తప్పకుండనట్లు దీవింపుము. తాటకను సంహరించి, శివధనుర్భంగముకావించి, సీతను వివాహమాడి, తండ్రి ఆజ్ఞతో అడవులకేగి, రావణ, కుంభకర్ణాది దుష్టదానవుల సంహరించిన రామా! నీ చరిత్ర మాకాదర్శమగు నట్లుగా దీవింపుము. రామాయణ గాథనంతనూ సంక్షిప్తంగా ఒక్క శతకంలో ఎంత బాగా చెప్పాడో కదా!

76వ పద్యము :
బలరామావతారము:-
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
శ్రీకృష్ణుని సోదరునిగా, రొహిణీదేవి కుమారునిగా, బలరాముడవై దుష్టసమూహమును ఖండించిన నీ భుజబలము నన్ను బ్రోచుగాక.

77వ పద్యము :
బుద్ధావతారము:-
సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
తరచి చూడగ దేవతలు పూజింపగ త్రిపురాపురి సుందరీ మణులను వరించుటకై బుద్ధావతారము ధరించితివి. త్రిపురాసుర సంహారమునకు పరమశివునకు తోడుగా, సాధనమును సమకూర్చిన నీవు బుద్ధుడవై మాకు సద్భుద్ధిని యొసగుము.

78వ పద్యము :
కల్క్యవతారము:-
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
వర్ణసంకరము చేత ఛేదించుటకు వీలుకాని పాపములతో నిండి ధరిత్రిని మేలుజాతి గుర్రమును అధిరోహించి, చేతియందు కత్తిని పట్టుకొని కల్కి అవతారమున వీర భోగ వసంతరాయలవై సజ్జనుల బ్రోచెడి నీవు దురాచారములను ఖండింపుము.

79వ పద్యము :
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ గురించి చింతన చేయక పోవడమే శరీరానికి గొప్ప శత్రువు వంటిది. ఊహాశక్తి నశింపక మునుపె, శరీరము రోగపీడితం కానప్పుడే నిన్ను నిశ్చలచిత్తుడనై ధ్యానించునట్లు జేయుము.

80వ పద్యము :
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
'రామా!' అను నీ నామస్మరణ శాశ్వతానందము కల్పించునటువంటిది. మోక్షమునకు మూలము. ఆపదల సముద్రమునకు నావ. మొహమనెడి మదించిన ఏనుగును అంకుశము వలె పొడుచును. ఐశ్వర్యముల నిచ్చు ధనాగారము. కోరిన కోర్కెలను తీర్చును. సంగ్రామమున విజయమొసగునది.

81వ పద్యము :
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
రామా! మండుచున్న అగ్నిపై దండెత్తిన మిడతల గుంపు ఆ అగ్నికి ఆహుతు అయినట్లుగా నీ నామస్మరణ మోక్షము నిచ్చుటయే కాక పలు జన్మ పాపములను ఖండించు కత్తి వంటిది.

82వ పద్యము :
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఎల్లప్పుడూ విష్ణుమూర్తి పాదపద్మములయందు భక్తి కలిగి ఇంద్రియములను జయించిన వానిని ఉత్తముడందురు. ఇంద్రియములకు వశము కాకుండా నిగ్రహించుటకు ప్రయత్నించిన వానిని మధ్యముడందురు. ఇంద్రియములకు బానిస అయిన వానిని అధముడందురు. నేను చెడ్డ బుద్ధి కలవాడను, అట్టి నన్ను ఏరీతిగ కాపాడెదవో రామా!

83వ పద్యము :
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిందెంతో ఉంది. పంచేంద్రియములకు బానిస అయితే, ఎంత నష్టపోతామో తెలుస్తుంది. అడవి ఏనుగు దేహ చాపల్యమునకు చిక్కెను. అది చర్మేంద్రియమునకు లొనయ్యెను. చేప ఎరను చూసి జిహ్వేంద్రియములకు ఆశపడి చిక్కెను. పాము, నాగస్వరము వినుచు, శ్రవణేంద్రియములకు లోనయి నశించెను. లేడులు నేత్రేంద్రియమునకు ఆశపడి నశించెను. తుమ్మెద పరిమళమునకాశపడి ఘ్రాణేంద్రియమునకు వశపడి నశించెను. ఈ పంచేంద్రియములను గెలుచుట నా తరమా? వానిని గెలుచుటకు నీవే తోడ్పడవలెను.

84వ పద్యము :
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
చేతులు నీకు నమస్కరించుచున్నవి. కన్నులు నిన్నే చూచుచున్నవి. నాలుక నిన్నే స్మరించుచున్నది. వీనులు నీ కథామృతమును గ్రోలుచున్నవి. ముక్కు నీ పూలపరిమళములను ఆశ్వాదించుచున్నది. ఇట్లు చేయుట మోక్షమునకు గొప్ప మార్గము. అట్లు పంచేంద్రియములు నిన్నే తలచి మ్రోక్కేటటువంటి భక్తి నాకు అనుగ్రహింపుము.

85వ పద్యము :
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఒక్క తులసి దళము భక్తితో సమర్పించినంతనే వాడు గంధర్వ, గరుడ, పన్నగులయందు ఒక్కడై ప్రకాశించుచుండును. బహు కాలము నీ పదసేవ జేసిన వారు కుడా ఊర్ధ్వలోకములందు నివసించుచుందురు. ఎల్లవేళలా నీ పాదార్చన చేయు వారికి పరమపదము అరిచేతిలో ఉసిరిక.

86వ పద్యము :
భానుడు తూర్పునందుగను పుట్టినఁ బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
రాక్షసుల గర్వమును హరించి, వారిని హతమార్చిన రామా! నీ అనితర కాంతిముందు, సూర్యుని ముందు చంద్రాగ్నుల కాంతి చిన్న బోయినట్లే, ఇతర దేవతల కాంతి క్షీణించును.

87వ పద్యము :
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ నామ నిశ్చల జపమునకు కోటి నదుల స్నానము, తీర్ధయాత్రలు సరికావు. నీ నామమే సర్వోత్కుృష్టమయినది. నీ మహనీయ మనెడి అమృత సాగరమునందు పూర్తిగా మునిగినచో జ్ఞానము చేకురును. మనస్సులోని మాలిన్యము నశించును.

88వ పద్యము :
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ప్రకాశించు కర్ణాభరణములు దాల్చిన రామా! బంగారమునకు అంటుకొన్న మాలిన్యము తొలగించవలెనన్న ఆ బంగారమును పుటము వేయవలెను. మనో మాలిన్యములను తొలగించవలెనన్న ఆ మనసును నీయందు లీనము చేయవలెను. భక్తియొగమనెడి అగ్నిజ్వాలలో పుటము వేయకున్నచో, అందలి మాలిన్యములు నశించవు కదా?

89వ పద్యము :
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నీ భార్య లక్ష్మీదేవి సకల సంపదలనొసగును. నీ పుత్రిక గంగాదేవి సమస్త పాపములను తొలగించును. మీ కుమారుడు, సృష్టికర్తయైన బ్రహ్మ ఆయుర్దాయమునిచ్చును. నిన్నే కోరి భజించిన ప్రయోజనములుకలుగవే.

90వ పద్యము :
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
తామరాకుపై నీటి బొట్టువలె బురదలో నివసించు కుమ్మరి పురుగుకు బురద అంటని మాదిరిగా మానవుడు జనక రాజర్షివలె సంసారియయ్యును విరాగివలె నుండవలెను.

91వ పద్యము :
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ

భావము :
తల్లిదండ్రులు, కుమారులు, భార్య, వీరంతా ఎక్కడినుంచి వచ్చారు? ఎన్నో జన్మలనెత్తుతూ, బంధములతగుల్కొని జీవించి మరణించునది దేహమే కాని, అన్నింట ప్రకాశించు జీవుడు ఒకడే. అన్ని జన్మల పాపపుణ్యములను జీవుడు తానే అనుభవించవలెను కాని ఎవరూ తోడురారు. నాకు మరు జన్మ మీద ఆశలేదు. హే రామా! నన్ను ఈ సంసార బంధములనించి విముక్తుని చేసి జీవన్ముక్తిని ప్రసాదించుము కరుణాసాగరా!

92వ పద్యము :
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
శరీరము వుర్ధాప్యములో శుష్కించినా, రాచరికములు, సిరులు అశాశ్వతములైనవివని తెలిసినా, తోటివారు చనిపోయినప్పుడు తాను కూడా ఒకరోజు చనిపోవలసిందేనని తెలిసినా మొహములో పడుతున్నాము. అట్టి ఈ వ్యామోహ పాశములను వదిలించి మా విముక్తి మార్గమును చుపవయా దేవా! దీనమందిరా!

93వ పద్యము  
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ

భావము : 
ఐశ్వరములలో తులతూగునాడు నేనే గొప్ప వాడినని విఱ్ఱవీగి నిన్నే మరిచితిని. దరిద్రదేవతలకు బానిసనైతిని ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనము? నీటి కోసము బావిని ముందు తవ్వవలనే కాని అగ్నిజ్వాలలు లేచినప్పుడో దాహముతోనున్నప్పుడో కాదు కదా! అట్టి నన్ను కాపాడవయా దేవదేవా! ఆశ్రితవత్సలా!

94వ పద్యము : 
జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ

భావము : 
చెరువు ఎండిపోయి బురద పడినాకూడా అందులోనే నీటిని కోరుకొను చేప మాదిరిగా ఎన్ని కష్టనష్టములు వచ్చిననూ, నిన్ను విడువలేక కొలుచు వానిని నీవును వదిలి పెట్టవు.

95వ పద్యము :
సరసునిమానసంబు
తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరిని యాచించకుండ, అడిగినవారికి లేదనకుండ, అసత్యము పలుకక, యుద్ధరంగమున జంకకనుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లిదండ్రులకే గాక వంశములకే, నీ వలెనే ఖ్యాతిదేగలడు. సర సఙ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహించువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
రసజ్ఞుని మనసును రసజ్ఞుడే గ్రహింపగలడు. కొలనులోనే నివసించు కప్ప ఆ కొలనులోని కమలముయొక్క తేనె గ్రహించలేనట్లే మూఢుడైన నీచుడు రసజ్ఞుని వూహ తెలిసికొనలేడు.

96వ పద్యము :
నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరిని యాచించకుండ, అడిగినవారికి లేదనకుండ, అసత్యము పలుకక, యుద్ధరంగమున జంకకనుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లిదండ్రులకే గాక వంశములకే, నీ వలెనే ఖ్యాతిదేగలడు.

97వ పద్యము :
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమందఁగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
నిన్ను నేను జానకీపతీ! లక్ష్మీ వల్లభా! సంపద ప్రదాతా, చిన్మయ రూపా, రామా, నారాయణా అని అన్ని సమయములందు విడువక స్తోత్రము చేయుచుండును. దానికి ఫలముగా నీవు నా హృదయమునందు ఎల్లవేళలా కొలువు దీరుము. నా పాపములను నశింపజేయుము. నాకు ముక్తి నిమ్ము.

98వ పద్యము :
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
శబరి ఎంగిలి పళ్ళు తిని, ఉడుత సహాయమునకు మెచ్చి దాని శరీరమున నీ గోటిచారలు గీసి, వారిని జీవన్ముక్తులు చేసిన నీ దయ నన్ను తప్పక రక్షించును. తక్కువ జన్మలకే మోక్షమొసంగిన నీకు ఉత్తమ జన్మలకు ముక్తిని ఒసగుట కష్టము కాదు. నీ మహత్యము నా లాంటి వారికి తెలియరాని వేదాంతమే కదా?

99వ పద్యము :
బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం
గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా
తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
ఉత్తముడే సత్యవాది. యుద్ధమున జంకని వాడే ధీరుడు. అర్ధిని వెనుకకు పంపనివాడే దాత మిమ్ము సేవించువాడే మంచి మనసుకలవాడు.

100వ పద్యము :
భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ

భావము :
భ్రమర కీటక న్యాయమున నీ నామస్మరణ మమ్ముల పరమాత్మ స్వరూపునిగా జేయును. కీటకము చుట్టూ పరిభ్రమించి, భ్రమరము దానిని కూడా భ్రమరము చేయును. అట్లే నీ నామస్మరణ మా దుఃఖములనెడి అంధకారములను పారద్రోలును.
భద్రాచల రామదాసు తన భక్త్యావేశముతో రాముని పరి పరి విధాల వేడు కొనటమే ఈ శతక ముఖ్యోద్దేశము. రామ నామ మాధుర్యము చేత రామా! రామా! అని ఎన్నిమార్లు ఉచ్చరించిననూ విసుగు కలగదు. తృప్తి కలగదు. ఆ నామమే తిరిగి తిరిగి పునశ్చరణ చెయుదమని రామదాసు ఉవాచ. ఆ రామనామ మాధుర్యమును ఎన్నో రకాలుగా కీర్తించినాడు.